Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మీడియా గురించి నయనతార 
  • 'సైరా' దర్శకుడి తదుపరి చిత్రం 
  • మరో చిత్రానికి రాజ్ తరుణ్ ఓకే

*  చాలాసార్లు తాను చెప్పింది ఒకటైతే, మీడియాలో వచ్చింది మరొకటని పేర్కొంది కథానాయిక నయనతార. తాను మీడియాను ఎందుకు దగ్గరకు రానీయదో తాజాగా 'వోగ్' మేగజైన్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. గతంలో మీడియాలో తన గురించి రకరకాలుగా రాశారని, అవి చూసి చాలా బాధపడ్డానని, అందుకే అప్పటి నుంచీ తాను మీడియాకు దూరంగా ఉంటానని ఆమె చెప్పింది. అయినా తాను చాలా ప్రైవేట్ పర్సన్ ని అనీ, ఎక్కువ ఎక్స్ పోజర్ కి ఇష్టపడనని తెలిపింది.
*  తాజాగా చిరంజీవితో 'సైరా' చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు పొందిన దర్శకుడు సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తాడు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి దీనిని నిర్మించే అవకాశం వుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.  
*  యంగ్ హీరో రాజ్ తరుణ్ మళ్లీ ఇప్పుడు స్పీడు పెంచాడు. ఈ క్రమంలో గతంలో తనతో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమా తీసిన శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయడానికి ఓకే చెప్పాడు. కాగా, ప్రస్తుతం రాజ్ తరుణ్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పై వున్నాయి.   

More Telugu News