Crime News: ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోగా ఇల్లు దోచేసిన దొంగలు

  • కడప జిల్లా ప్రొద్దటూరులో దొంగల బీభత్సం
  • తెల్లవారు జామున ఓ ఇంట్లో చోరీ
  • 55 తులాల బంగారం అపహరణ

తెల్లవారు జామున కుమార్తెకు పురిటినొప్పులు రావడంతో  ఇంటికి తాళం వేసి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి వచ్చేలోగా ఇంటిని దోచేశారు దొంగలు. కడప జిల్లా ప్రొద్దటూరు వైఎంఆర్‌లో ఈరోజు తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన మధుకుమార్‌ కుమార్తె నిండుగర్భిణి. పురిటి కోసం కొన్నాళ్ల క్రితం పుట్టింటికి ఆమె వచ్చింది. ఈరోజు తెల్లవారు జామున ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కాసేపటికి నొప్పులు ఎక్కువై ఆమె ఇబ్బంది పడుతుండడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఇంటికి తాళంవేసి హుటాహుటిన ఆమెను తీసుకుని సమీపంలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.

కుమార్తెను ఆసుపత్రిలో ఉంచి మధుకుమార్‌ కాసేపటికి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటి తలుపు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగి ఉంటుందని అనుమానించి వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఈ ఘటనలో దొంగలు 55 తులాల బంగారం ఎత్తుకు వెళ్లారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

More Telugu News