Sunny Leone: మనసున్న మారాణి...క్యాన్సర్‌ బాధితుల కోసం సన్నీలియోనీ చిత్రలేఖనం

  • పెయింటింగ్‌లు వేసి వేలానికి ఉంచనున్నట్లు ప్రకటన
  • ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్
  • వచ్చిన నిధులు బాధితుల కోసం ఖర్చు చేస్తానని వెల్లడి

క్యాన్సర్‌ బాధితుల కోసం తనవంతు సాయం అందించాలని ముందుకు వచ్చారు ఒకప్పటి పోర్న్‌స్టార్‌, బాలీవుడ్‌ నటి సన్నీలియోనీ. ఇందుకోసం పెయింటింగ్‌లు వేసి వాటిని వేలం పెట్టనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇటీవల విడుదలైన ‘అర్జున్‌ పాటియాలా’లో మెరుపులా మెరిసిన సన్నీలియోనీ ప్రస్తుతం ‘స్ల్పిట్స్‌ విల్లా సీజన్‌ 12’ రియాల్టీ షోతో బిజీగా ఉన్నారు. హర్రర్‌, కామెడీ నేపథ్యంతో సాగే ‘కోకాకోలా’ సినిమాలో కూడా నటించనున్నారు. అంత బిజీలోనూ ఆమె ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

‘క్యాన్సర్‌ బాధితుల కోసం నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. ఇందుకోసం పెయింటింగ్స్‌ వేశాను. వాటిని వేలానికి ఉంచుతున్నాను. అలా వచ్చిన డబ్బును క్యాన్సర్‌ బాధితులకు అందజేస్తాను‘ అంటూ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కొన్ని పెయింటింగ్స్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

'పెయింటింగ్‌లు వేసినప్పుడే క్యాన్సర్‌ బాధితుల కోసం ఆలోచించాను. మీరు కూడా క్యాన్సర్‌ బాధితుల కోసం తోచిన సాయం చేయండి' అంటూ సూచించారు.

More Telugu News