Telangana: జనగామలో దారుణం: కారుతో బైక్‌ను ఢీకొట్టి వివాహితను కిడ్నాప్ చేసిన దుండగులు

  • యాదాద్రి నుంచి పారపల్లికి వెళ్తుండగా ఘటన
  • ఆస్తి తగాదాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ
  • భర్తను చావబాది భార్యను కిడ్నాప్ చేసిన దండుగులు

తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని రాంపల్లి సమీపంలో భార్యాభర్తలు ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో ఢీకొట్టిన దుండగులు వివాహితను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణంగా తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. బండ తిరుపతి-భాగ్యలక్ష్మి దంపతులు శనివారం సాయంత్రం యాదాద్రి నుంచి భువనగిరి జిల్లాలోని పారపల్లికి బైక్‌పై వెళ్తున్నారు.

రాంపల్లి సమీపంలో వెనక నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో దంపతులు కిందపడ్డారు. ఆ వెంటనే కారు ఆపి కిందికి దిగిన నిందితులు తిరుపతిపై దాడిచేసి ఆయన భార్య భాగ్యలక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. స్పృహతప్పి పడిన బాధితుడిని గుర్తించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News