Ambulence: అంబులెన్స్ లో అయిపోయిన డీజిల్... ప్రసవ వేదనతో నిండుచూలాలు మృతి!

  • మయూర్ భంజ్ జిల్లాలో దారుణం
  • డీజిల్ అయిపోయి రోడ్డుపైనే ఆగిన అంబులెన్స్
  • విచారణ ప్రారంభించిన ఉన్నతాధికారులు

నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తున్న వేళ, అంబులెన్స్ లో ఇంధనం అయిపోగా, సరైన సమయంలో చికిత్స అందక ఆమె మరణించింది. ఈ ఘటన ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో జరిగింది. ఇక్కడికి సమీపంలోని హండా గ్రామానికి చెందిన తులసి అనే మహిళకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం మయూర్ భంజ్ కి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

దీంతో అంబులెన్స్ లో ఆమెను తీసుకు వెళుతుండగా, డీజిల్ అయిపోయి, అది కాస్తా రోడ్డుపై నిలిచిపోయింది. మరో అంబులెన్స్ అక్కడికి చేరుకునేందుకు గంటకు పైగా సమయం పట్టగా, ఈలోగా ఆమె ప్రాణాలు పోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు, మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఇంధనం లేకుండా అంబులెన్స్ ను నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

More Telugu News