Tollywood: విజయవాడ ప్రజలు ఎంత అదృష్టవంతులో నాకు ఇప్పుడు అర్థమవుతోంది: బండ్ల గణేశ్

  • నిర్మాత పీవీపీపై బండ్ల గణేశ్ సెటైర్లు
  • సినిమా తీసిన ప్రతి హీరోతో గొడవే
  • కమలహాసన్ నే కోర్టుకు లాగిన ‘నీచ చరిత్ర నీది’

టాలీవుడ్ నిర్మాత, వైసీపీ నేత పీవీపీకి మరో నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కు మధ్య ఆర్థిక వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. పీవీపీపై ఇప్పటికే పలు విమర్శలు, ఆరోపణలు చేసిన బండ్ల గణేశ్ మరోమారు రెచ్చిపోయారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన పీవీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఓ ట్వీట్ చేశారు. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో విజయవాడ నగర ప్రజలు ఎంత అదృష్టవంతులో తనకు ఇప్పుడు అర్థమవుతోందని అన్నారు. కొందరు స్కామ్ రాజాలు ఇండస్ట్రీని భ్రష్టుపట్టించారని, సినిమా తీసిన ప్రతి హీరోతో గొడవే, ప్రతి డైరక్టర్ తో పంచాయతీనే, ప్రతి నటుడితో గొడవలే అంటూ పీవీపీపై పరోక్ష విమర్శలు చేశారు.

సినీ ఇండస్ట్రీకి హిట్ లు, బ్లాక్ బస్టర్లు ఇవ్వడం తెలుసు కానీ, కోర్టుల చుట్టూ తిరగడం కొత్తగా నేర్పాడు ఈ స్కామ్ రాజా అంటూ ధ్వజమెత్తారు. ప్రపంచంలో నేను ఏ దేశానికైనా హ్యాపీగా వెళ్లి తిరిగొస్తానని, కొందరు స్కామ్ రాజాలు వేరే దేశాలకు వెళ్తే అరెస్టు చేసి బొక్కలో వేస్తారని అందరూ చెప్పుకుంటుంటే విన్నానంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచం, భారతదేశం గర్వించదగ్గ నటుడు, పద్మశ్రీ కమలహాసన్ నే కోర్టుకు లాగిన ‘నీచ చరిత్ర నీది’ అంటూ పీవీపీపై పరోక్ష విమర్శలు చేశారు.  తొమ్మిదేళ్ల పాటు ఎంతో కష్టపడి అధికారాన్ని సీఎం జగన్ జేజిక్కించుకున్నారని, కొందరు దుర్మార్గులకు పెత్తనాలు ఇచ్చి, జగన్ తన కీర్తిని పాడు చేసుకోవద్దని ఆయనకు తన వినయపూర్వక విన్నపం అని పేర్కొన్నారు.

More Telugu News