KCR: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ మరో చాన్స్!

  • గత రాత్రి నుంచి సమ్మె
  • ఈ ఉదయం ఉన్నతాధికారులతో చర్చించిన కేసీఆర్
  • సమ్మె విరమిస్తే కొన్ని డిమాండ్ల పరిష్కారం

గత రాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఉదయం కొందరు ఉన్నతాధికారులు సీఎంను కలువగా, సమ్మెను విరమించి, వెంటనే విధుల్లోకి రావాలని మరోసారి పిలుపునివ్వాలని సీఎం సూచించినట్టు సమాచారం. కార్మిక సంఘాల నేతలు సానుకూలంగా స్పందిస్తే, కొన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి, కార్మికులకు అనుకూల నిర్ణయాలు తీసుకుందామని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఇదే సమయంలో సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, కార్మికులు విధుల్లోకి వచ్చినా, రాకున్నా సాధ్యమైనన్ని ఎక్కువ బస్సులను తిప్పాలని కేసీఆర్ సూచించినట్టు ఓ అధికారి వెల్లడించారు. అద్దె బస్సుల కోసం సాయంత్రంలోగా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయనున్న సంగతి తెలిసిందే.

More Telugu News