Bandla Ganesh: నన్ను హత్య చేసేందుకు రెక్కీ కూడా నిర్వహించారు: బండ్ల గణేశ్

  • కోర్టును ఆశ్రయించి, ఇప్పుడు బెదిరిస్తున్నారు
  • వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరిన్ని వేధింపులు
  • రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన గణేశ్

తాను డబ్బులు బకాయి ఉన్నానంటూ కోర్టుకు ఎక్కి, కేసులు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ, ఇప్పుడు తనపై దౌర్జన్యానికి దిగుతూ, హత్య చేస్తానని బెదిరిస్తున్నారని సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఆరోపించారు. ఈ ఉదయం హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులకు పీవీపీపై ఫిర్యాదు చేసిన అనంతరం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు.

తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇదే సమయంలో పీవీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్టు తెలిపారు. విజయవాడ తన చేతుల్లోనే ఉందని, ఏపీలో తాను ఏం చెబితే అది జరుగుతుందని పీవీపీ తనను బెదిరించినట్టు బండ్ల గణేశ్ ఆరోపించారు. తనను హత్య చేసేందుకు రెక్కీ కూడా నిర్వహించారని, ముఖ్యంగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం పోయి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తనకు వేధింపులు పెరిగాయని అన్నారు. పోలీసు ఉన్నతాధికారులు పీవీపీని పిలిపించి మాట్లాడతామని తనకు హామీ ఇచ్చారని మీడియాకు బండ్ల గణేశ్ వివరించారు.

More Telugu News