Godavari: ఆ అవకాశమే ఉంటే ఒక్కరోజులో బోటును బయటికి తీస్తా: ధర్మాడి సత్యం

  • గోదావరిలో బోటు మునక
  • వెలికితీత పనులకు దిగిన ధర్మాడి సత్యం బృందం
  • నాలుగో రోజు నిలిచిపోయిన పనులు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మునిగిపోయిన బోటును వెలికితీస్తే ఆచూకీ తెలియని వారి మృతదేహాలు కూడా బయటపడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో బోటు వెలికితీత పనులను కాకినాడ బాలాజీ మెరైన్స్ సంస్థకు అప్పగించింది. అయితే, మూడ్రోజులు తీవ్రంగా ప్రయత్నించినా బోటు ఆచూకీ లభ్యం కాలేదు. నాలుగోరోజు ప్రతికూల వాతావరణం కారణంగా పనులు నిలిచిపోయాయి. దీనిపై బాలాజీ మెరైన్స్ అధినేత ధర్మాడి సత్యం మీడియాతో మాట్లాడారు.

బోటు మునిగిపోయిన ప్రాంతంలో గతంలో కంటే ఇప్పుడు సుడిగుండాలు తీవ్రంగా ఉన్నాయని, తాము ప్రయాణిస్తున్న బోటు యజమాని భయపడుతున్నాడని, అందుకే వెలికితీత పనులు నిలిపివేశామని చెప్పారు. భారీ వర్షం పడడంతో గోదావరి ఉద్ధృతి మరింత పెరిగిందని, దాంతో సుడిగుండాలు తీవ్రత మరింత ఎక్కువైందని వివరించారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వెలికితీత కష్టసాధ్యమని ధర్మాడి సత్యం తెలిపారు.

అయితే, ఎన్డీఆర్ఎఫ్ దళాల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నదిలోకి వెళ్లి బోటుకు నేరుగా లంగరు తగిలించే వీలుంటుందా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ఆ అవకాశమే ఉంటే తాను ఒక్కరోజులో బోటును బయటికి తీసిస్తానని ధర్మాడి సత్యం చెప్పారు. సముద్రంలో మునిగిపోయిన బోట్లును కూడా బయటికి తీసిన చరిత్ర తమకుందని, కానీ ఇక్కడ సుడిగుండాలు అన్ని ప్రయత్నాలకు ప్రతిబంధకంగా మారాయని అన్నారు. తమకు డబ్బు ముఖ్యం కాదని, బోటును వెలికితీయాలన్న లక్ష్యంతోనే వచ్చామని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News