New Delhi: చిన్న బృందాలుగా విడిపోయిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు... ఓ బృందం ఢిల్లీకి..?

  • ఆత్మాహుతి దళంగా అనుమానం
  • వరుస దాడులకు పాల్పడే అవకాశముందున్న ఐబీ
  • ఉత్తరాది రాష్ట్రాల్లో ఎయిర్ బేస్ ల వద్ద అప్రమత్తత

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశాక పాకిస్థాన్ ప్రోద్బలిత ఉగ్రవాద సంస్థలు భారత్ పై ప్రతీకారానికి రగిలిపోతున్నాయి. సరిహద్దు వెంబడి దాదాపు 500 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని ఇటీవలే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో తాజా హెచ్చరికలు చేసింది. పాకిస్థాన్ వైపు నుంచి జైషే మహ్మద్ ఉగ్రవాదులు చిన్న బృందాలుగా విడిపోయి భారత్ లో చొరబడ్డారని, వారిలో నలుగురితో కూడిన ఓ టీమ్ దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టిందన్నది నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం.

జైషే మహ్మద్ ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడాలన్న లక్ష్యంతో భారత్ లో ప్రవేశించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆత్మాహుతి దాడులకు దిగే అవకాశాలున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తులను నిశితంగా సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లోని కీలకమైన ఎయిర్ బేస్ ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. జైషే గ్రూపు హిట్ లిస్టులో భారత వాయుసేన కేంద్రాలు కూడా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలంటున్నాయి.

More Telugu News