ACB: ఏసీబీకి చిక్కిన కర్నూలు జిల్లా మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌

  • సోదాలు జరుపుతున్న అధికారులు
  • భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం
  • భార్యతోపాటు పలువురు బినామీలు

అవినీతి నిరోధక శాఖ అధికారులకు కర్నూలు జిల్లా మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న సమాచారంతో ఈ రోజు ఆయన ఇంటిపై అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు సహా హైదరాబాద్‌, బెంగళూరులోని రెండు ప్రాంతాలు, తాడిపత్రిలో ఏకకాలంలో సోదాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ సంపాదన కూడబెట్టినట్లు లెక్కతేల్చారు.

బెంగళూరులో అపార్ట్‌మెంట్‌తోపాటు హైదరాబాద్‌లో మరో భవనం కూడా ఉన్నట్లు లెక్క తేల్చారు. కర్నూల్‌లోని ఇంట్లో కేజీకిపైగా బంగారాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఉగాండా దేశంలో బ్యాంక్‌ అకౌంట్‌, హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో లాకర్‌ ఉన్నట్లు గుర్తించారు.

అలాగే, భార్య పేరు మీదు శివప్రసాద్‌ రెండు సూట్‌ కేసు కంపెనీలను నడుపుతున్నట్లు ఏసీబీ అధికారులు తనిఖీల్లో బయటపడింది. అక్రమాస్తుల చిట్టా భారీగా ఉండడంతో సాయంత్రం వరకు సోదాలు సాగే అవకాశం ఉంది.

More Telugu News