piyush goyal: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇంటి నుంచి రహస్య డాక్యుమెంట్ల చోరీ.. ఇంట్లో పనిచేస్తున్న యువకుడే నిందితుడు!

  • మూడేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న యువకుడే నిందితుడు
  • చోరీ చేసిన రహస్య పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులకు ఈమెయిల్
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ముంబైలోని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇంట్లో చోరీ జరిగింది. ఆయన ఇంట్లో పనిచేస్తున్న విష్ణుకుమార్ విశ్వకర్మ (28) అనే యువకుడు ఈ చోరీకి పాల్పడ్డాడు. గత నెల 16 నుంచి 18 మధ్య మంత్రి ఇంట్లోని వెండి, ఇత్తడి వస్తువులతోపాటు ఆయన వ్యక్తిగత కంప్యూటర్‌లోని అధికారిక రహస్య పత్రాలను విష్ణుకుమార్ చోరీ చేశాడు. గత మూడేళ్లుగా విష్ణుకుమార్ మంత్రి ఇంట్లో పనిచేస్తున్నాడు.

చోరీ చేసిన రహస్య ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులకు అతడు ఈమెయిల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈమెయిల్ చేసిన అనంతరం తన ఫోన్‌లోని సమాచారాన్ని విష్ణుకుమార్ డిలీట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మంత్రి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి చోరీ అయిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

More Telugu News