onion: ఎగుమతుల నిలిపివేత ఎఫెక్ట్‌: ఆసియా దేశాల్లో రెట్టింపైన ఉల్లి ధరలు

  • భారత్‌ మార్కెట్ ను మించిన ఘాటుతో సతమతం
  • పొరుగు దేశాలపై ఎక్కువ ప్రభావం
  • బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో కేజీ రూ.120

ఆసియా మార్కెట్లలో ఉల్లి ధరలు మండుతున్నాయి. ముఖ్యంగా మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌తోపాటు మలేషియా మార్కెట్లలో ఉల్లి ధర చుక్కలను అంటుతోంది. భారత్‌ నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో ఈ మార్కెట్లలో ధరలపై స్పష్టమైన ప్రభావం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ఉల్లి కన్నీరు పెట్టిస్తున్న విషయం తెలిసిందే.

ఆసియాలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ సబ్జి మండీలో కూడా ధర మండిపోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్‌లో పరిస్థితులను అనుసరించి రూ.70పైనే పలుకుతోంది. గత కొన్నాళ్లుగా దేశంలోని అన్ని మార్కెట్లలో ఉల్లి ధర ఊహించని స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఎగుమతులు నిలిచిపోవడంతో ఆసియా మార్కెట్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

దీంతో పొరుగు దేశాల వినియోగదారులు ఉల్లి ధరతో కన్నీళ్లు పెడుతున్నారు. బంగ్లాదేశ్‌లో పక్షం రోజుల క్రితం కేజీ ఉల్లి 60 రూపాయలు పలకగా ప్రస్తుతం 120 రూపాయలకు చేరింది. ఇక శ్రీలంకలో ఆ దేశ రూపాయల్లో కేజీ ఉల్లి 300కు అమ్ముడవుతోంది.

More Telugu News