Odisha: అమ్మ చెంతకు చేరిన పదేళ్ల క్రితం తప్పిపోయిన బాలుడు!

  • గంజాం జిల్లా దిగపొహండి సమీపంలోని తరుబుడి గ్రామంలో ఘటన
  • ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి చేరని బధిరుడు
  • కుడి నుంచి ఎడమకు చేతిరాత రాస్తుండడంతో ముస్లిం అని గుర్తించి ఆరా

పదేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన బిడ్డ ఇన్నేళ్ల తరువాత తల్లి చెంతకు చేరడంతో ఆ కుటుంబం ఆనందం వర్ణనాతీతం. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా దిగపొహండి సమీపంలోని తరుబుడి గ్రామానికి చెందిన షేక్‌ కమాల్‌, సహజబి దంపతుల కొడుకు షేక్‌బాబు పుట్టుక నుంచి చెవిటి, మూగవాడు. ఏడేళ్ల ప్రాయంలో  2009లో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి చేరలేదు. దీంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు కొడుకుపై ఆశలు వదులుకున్నారు. కొడుకుపై బెంగతో తండ్రి షేక్‌కమల్‌ చనిపోయాడు.

కాగా, 2016లో బ్రహ్మపుర రైల్వేస్టేషన్‌లో తిరుగుతున్న ఈ బాలుడిని చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు గుర్తించి గంజాం జిల్లా కొదలాలోని బాలవికాస్‌ ఆవాసిక కేంద్రానికి తరలించారు. మూగవాడు కావడంతో వివరాలేవీ చెప్పలేకపోవడంతో కాలియా అని పేరు పెట్టి చదువు చెప్పడం ప్రారంభించారు. బాలుడు కుడివైపు నుంచి ఎడమవైపునకు రాస్తుండడంతో ముస్లిం కుర్రాడు అయి ఉంటాడని భావించి జిల్లాలో తప్పిపోయిన ముస్లిం బాలుర వివరాలపై ఆరాతీశారు.

దీంతో తురుబడిలోని షేక్‌బాబు తల్లి షహజబి కొడుకును గుర్తించింది. దీంతో తల్లి షహజబి, తురుబడి సర్పంచ్‌, సమితి సభ్యుడు తదితరులతో మాట్లాడి అన్ని వివరాలు నిర్థారించుకున్నాక సీడబ్ల్యూసీ కార్యాలయం ప్రతినిధులు బాలుడిని అతని తల్లికి అప్పగించారు.

More Telugu News