Crime News: భర్త ప్రియురాలి ఇంటి ముందు భార్య, కుటుంబ సభ్యుల ఆందోళన

  • గత కొన్నాళ్లుగా దంపతుల మధ్య ఈ విషయమై విభేదాలు
  • ఆందోళనతో ఇరువర్గాల మధ్య తోపులాట
  • పోలీసుల అదుపులో నిందితుడు, అతని ప్రియురాలు

తనను, పిల్లల్ని పట్టించుకోకుండా మరో మహిళతో కాపురం చేస్తున్న భర్త తీరును నిరసిస్తూ ఓ మహిళ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ప్రియురాలి ఇంట్లోనే భర్త ఉన్నాడని తెలుసుకుని కుటుంబ సభ్యులతో సహా ఏకంగా అక్కడకు చేరుకుంది. ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

పోలీసుల కథనం మేరకు...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సూరారం గ్రామానికి చెందిన వాంకుడోత్‌ నర్సింహ, అశ్వాపురం మండలం మొండికట్ట గ్రామానికి చెందిన నాగమణి దంపతులు. 2000 సంవత్సరంలో వీరికి పెళ్లికాగా, వీరికి ఏడో తరగతి చదువుతున్న కొడుకు, నాలుగో తరగతి చదువుతున్న కూతురు ఉన్నారు.

కేటీపీఎస్‌లోని అగ్నిప్రమాద నివారణ సంస్థలో ఉద్యోగి అయిన నర్సింహకు టేకుపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడం, పెద్దల పంచాయతీ వరకు వెళ్లడం జరిగిపోయాయి. అయినా భర్త తీరు మార్చుకోలేదు.

ఈ క్రమంలో నాగమణి గత కొన్నాళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. మరోపక్క పాల్వంచ పట్టణంలోని శ్రీనగర్‌కాలనీలోని ఓ ఇంట్లో తన ప్రియురాలిని ఉంచి, భర్త కూడా అక్కడే ఉంటున్నాడని తెలుసుకుంది. దీంతో తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కాలనీకి చేరుకుని భర్త ప్రియురాలి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. దీంతో బయటకు వచ్చిన నర్సింహకు, నాగమణి కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

విషయం పోలీసులకు తెలియడంతో వారు రంగప్రవేశం చేసి నర్సింహను, అతని ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏడాది క్రితమే తాను సదరు మహిళను పెళ్లి చేసుకున్నానని నర్సింహ చెబుతున్నాడు.

More Telugu News