Hyderabad: బస్సులో పది తులాల బంగారు ఆభరణాల చోరీ

  • తూప్రాన్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన
  • సంచిలోంచి చాకచక్యంగా దొంగిలించిన దుండగుడు
  • సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ సంచిలోంచి పది తులాల బంగారు నగలు మాయమయ్యాయి. సంచిలో నగల డబ్బా ఉందని గ్రహించిన దుండగుడు చాకచక్యంగా వాటిని దొంగిలించాడు. తూప్రాన్‌‌లో జరిగిందీ ఘటన. పోలీసుల వివరాల ప్రకారం.. తూప్రాన్‌కు చెందిన యాదగిరి, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె సంధ్యకు ఇటీవల తాతబాపన్‌ప్లలికి చెందిన దుర్గాస్వామితో వివాహమైంది.

హైదరాబాద్‌లో బంధువుల ఇంట్లో జరిగే పూజలో పాల్గొనేందుకు మంగళవారం తల్లితో కలిసి సంధ్య బయలుదేరింది. తూప్రాన్‌ బస్టాండ్‌లో తల్లితో కలిసి హైదరాబాద్ బస్సెక్కిన సంధ్య.. కరీంగూడ వద్ద తన భుజానికి తగిలించుకున్న సంచి తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి చూసింది. అంతే, గుండె గుభేల్ మంది.

అందులో పది తులాల బంగారు నగలు ఉంచిన డబ్బా కనిపించలేదు. దీంతో షాక్ తిన్న వారు బస్సు ఆపమని చెప్పి అక్కడి నుంచి ఆటోలో తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

More Telugu News