Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరిగిన మద్యం ధరలు.. నేటి నుంచే అమలు

  • కనిష్టంగా పది రూపాయల పెంపు
  • గరిష్టంగా రూ.250
  • ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం మందుబాబులకు షాకిచ్చింది. స్వదేశీ, విదేశీ మద్యం సీసాలపై కనిష్టంగా పది రూపాయల నుంచి గరిష్టంగా రూ.250 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రెడీ టు డ్రింక్ పేరుతో విక్రయించే 250/275 ఎంఎల్ మద్యం సీసాలపై రూ.20 పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..స్వదేశీ, విదేశీ మద్యం క్వార్టర్ సీసాపై రూ.20, హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 పెరిగింది. స్వదేశీ మద్యం 60/90 ఎంఎల్ బాటిళ్లపై రూ.10, లీటరు మద్యం సీసాపై రూ.100, రెండు లీటర్ల బాటిల్‌పై రూ.250 పెంచారు. విదేశీ మద్యం 50/60 ఎంఎల్ సీసాలపై రూ.10, లీటరున్నర-రెండు లీటర్లు కలిగిన మద్యం బాటిళ్లపై రూ.250 పెరిగింది. ఇక, 330/500 ఎంఎల్ బీర్ సీసాలపై రూ.10, 650 ఎంఎల్ బీరు సీసాలపై రూ.20 పెరిగింది.

అలాగే, స్వదేశీ, విదేశీ మద్యంపై 6 శాతం రిటైల్ ఎక్సైజ్ పన్ను విధించింది.  నేటి నుంచి మద్యం దుకాణాలు నిర్వహించనున్న ఏపీబీసీఎల్‌కు అమ్మకాల్లో 4 శాతాన్ని కమిషన్‌గా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణాల అద్దె, సిబ్బంది వేతనాలు చెల్లించేందుకు ఈ కమిషన్‌ను వినియోగించనున్నారు.

నేటి నుంచి ఏపీలో మద్యం అమ్మకాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే కొనసాగనున్నాయి. నిజానికి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం తొలుత ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత వాటిని సవరించి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలు ఉండగా, దశల వారీ మద్య నిషేధం అమల్లో భాగంగా వీటి సంఖ్యను 20 శాతం తగ్గించనున్నారు. ఇక, నేటి నుంచి ఏపీలో 3500 దుకాణాలు ఏపీబీసీఎల్ ఆధ్వర్యంలో నడవనున్నాయి.

More Telugu News