Pakistan: కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మన్మోహన్ సింగ్ ను పిలవాలనుకుంటున్నాం: పాకిస్థాన్

  • సిక్కు భక్తుల కోసం కర్తార్ పూర్ కారిడార్
  • మన్మోహన్ ను సిక్కుల ప్రతినిధిగా భావిస్తామన్న పాక్
  • ఆయనకు ఆహ్వానపత్రిక పంపుతామన్న పాక్ విదేశాంగ మంత్రి

త్వరలో జరిగే కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి తాము భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఆహ్వానించదలుచుకున్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి వెల్లడించారు. మన్మోహన్ సింగ్ ను సిక్కు వర్గానికి ప్రతినిధిగా భావిస్తున్నామని, ఆయనకు త్వరలోనే ఆహ్వాన పత్రిక పంపిస్తామని తెలిపారు.

దేశవిభజన సమయంలో పంజాబ్ కూడా రెండు ముక్కలుగా విడిపోయింది. భారత్, పాక్ దేశాల్లో పంజాబ్ పేరిట రాష్ట్రాలున్నాయి. ఈ నేపథ్యంలో, సరిహద్దు వెంబడి ఇరుదేశాల్లో సిక్కులకు పరమపవిత్రమైన పుణ్యక్షేత్రాలు కొలువుదీరాయి. భారత్ లో డేరా బాబా నాక్ సాహిబ్, పాకిస్థాన్ లో గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్ పూర్ పేరిట ఈ క్షేత్రాలు ప్రాచుర్యం పొందాయి.

భారత్, పాక్ దేశాల్లోని సిక్కులు ఆ పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు వీలుగా కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. సరిహద్దు వెంబడి ఇరుదేశాల్లోనూ దీనికి సంబంధించి గతేడాది శంకుస్థాపనలు జరిగాయి. దీని ద్వారా భారత్ నుంచి వచ్చే సిక్కు భక్తులు ఎలాంటి వీసాలు లేకుండా పాక్ భూభాగంలోని గురుద్వారా క్షేత్రాన్ని సందర్శించే సౌలభ్యం కలగనుంది.

More Telugu News