Heart attacks: ఆ మూడూ ఉంటే మీ గుండెకు చేటే!: హృద్రోగ నిపుణుడి హెచ్చరిక

  • హర్రీ, వర్రీ, కర్రీలకు స్వస్తి పలకాలి
  • ప్రశాంతంగా జీవించడం అలవాటు చేసుకుంటే మంచిది
  • తరచూ ముందస్తు పరీక్షలు చేయించుకోవడం బెటర్

గుండె జబ్బులు ఇప్పుడు సర్వసాధారణమయిపోయాయి. చిన్న వయసులోనే పలువురు హార్ట్‌ ఎటాక్‌ బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి తెచ్చుకోకూడదంటే ముచ్చటగా మూడు సూత్రాలు పాటించాలంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ చొక్కలింగం.  ఈ యాంత్రిక యుగంలో ఒత్తిడి సర్వసాధారణంగా మారిందని, దీంతో గుండె లయ తప్పుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

హర్రీ, వర్రీ, కర్రీలకు స్వస్తి చెప్పడమే ఈ సమస్యకు పరిష్కారమని ఆయన సూచించారు. అనుకోగానే అన్ని పనులు పూర్తికావని, ఒక్కోసారి సమస్యలు ఎదురవుతాయని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సంయమనంతో పనిని పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తే హడావుడి పడాల్సిన అవసరం ఉండదని గుర్తు చేశారు.

అలాగే జీవితం అన్నాక కష్టసుఖాలు సర్వసాధారణమని చెప్పారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోయినంత మాత్రాన సమస్య నుంచి బయటపడలేమన్నారు. భయాందోళనకు గురయ్యేకంటే ఆ కష్టం నుంచి గట్టెక్కేందుకు మార్గం కోసం ప్రశాంతంగా ఆలోచించాలని సూచించారు. ఇక, అతిముఖ్యమైనది జిహ్వ చాపల్యమని డాక్టర్‌ చొక్కలింగం తెలిపారు.

రుచుల కోసం ఆరాటపడుతూ ఎక్కువమంది ఇంటి భోజనానికి స్వస్తి పలుకుతున్నారని, హోటల్‌ భోజనానికి మోజు పడుతున్నారని అన్నారు. దీనివల్ల ఒంట్లో కొవ్వు పేరుకుపోయి సమస్యలు ‘కొని’ తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ మూడింటికి స్వస్తి పలికి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మీ గుండెకు ఏ సమస్యా ఉండదని డాక్టర్‌ చొక్కలింగం సూచించారు.

More Telugu News