Kurnool District: చికెన్‌ షాపులో విషాదం...గ్యాస్‌ సిలెండర్‌ పేలి ఒకరి మృతి

  • మంటలతో షాపు దగ్ధం
  • ఆదివారం కావడంతో ఉదయాన్నే చేరుకున్న షాపు యజమాని
  • అమ్మకాలకు పొయ్యి సిద్ధం చేస్తుండగా ఘటన

ఆదివారం కావడంతో వ్యాపారం బాగుంటుందన్న ఉద్దేశంతో ఉదయాన్నే దుకాణానికి చేరుకున్న అతనికి అదే ఆఖరి రోజని తెలిసి ఉండదు. చికెన్‌ దుకాణంలో గ్యాస్‌ పేలిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

నంద్యాలలోని నూనెపల్లి ఫ్లైఓవర్‌ సమీపంలో సుబ్బయ్య అనే వ్యక్తి చికెన్‌ షాపు నడుపుతున్నాడు. సాధారణంగా అదివారం మాంసప్రియులు అధికంగా ఉంటారు. కావున వ్యాపారం బాగా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయాన్నే సుబ్బయ్య దుకాణానికి చేరుకున్నాడు.

కోళ్లను చంపి మాంసం అమ్మకాలకు అనుకూలంగా మార్చేందుకు అవసరమైన వేడినీళ్లు కాచేందుకు గ్యాస్‌ పొయ్యి వెలిగించాడు. ఈ ప్రయత్నంలో సిలెండర్‌ పేలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పేలుడు అనంతరం మంటలు చికెన్‌ షాపునకు విస్తరించడంతో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

More Telugu News