election rules: ఎన్నికల నిబంధనలు అతిక్రమించారన్న కేసులో చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

  • గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా
  • తన ఆదాయాన్ని బాబు సరిగా చూపలేదన్న పిటిషనర్‌
  • వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి తరపు అతని ఏజెంట్‌ పిటిషన్‌

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ దాఖలైన కేసులో హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు తన ఆదాయ వివరాలను అఫిడవిట్‌లో చూపించకుండా గోప్యత పాటించారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి తరపున ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించిన విద్యాసాగర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సిహెచ్‌.మానవేంద్రరాయ్‌ శనివారం విచారణ చేపట్టారు. ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేశారు.

అలాగే కృష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి ఓటర్లకు పంపిణీ చేశారని, ఆ విధంగా తనకు అనుకూలంగా ఓటింగ్‌ జరిగేందుకు మభ్యపెట్టారంటూ ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు వంశీకి కూడా నోటీసు జారీ చేసింది.

More Telugu News