YSRCP: సీఎం జగన్ నీతివంతమైన పాలనను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు: లక్ష్మీపార్వతి

  • జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు
  • చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చేసింది శూన్యం
  • బాబు పాలనలో ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగింది

ఏపీ సీఎం జగన్ పాలనపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. నీతివంతమైన జగన్ పాలనను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. తాడేపల్లిలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, అవినీతి రహిత పాలన చేస్తున్నారని అన్నారు.

కేవలం నాలుగు నెలల పాలనలో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత జగన్ దేనని కొనియాడారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనలో చేసింది శూన్యం అని విమర్శించారు. పీపీఏలలో, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు పాలనలో ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ పైనా విమర్శలు చేశారు. ‘ట్విట్టర్’ లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబు దే నంటూ సెటైర్లు విసిరారు.

More Telugu News