Hyderabad: పెళ్లయిందన్న విషయాన్ని దాచిపెట్టి.. మరో యువతిని పెళ్లాడిన ఆర్మీ జవాను అరెస్ట్

  • ప్రేమకు దారితీసిన పరిచయం
  • ఆలయంలో యువతి మెడలో తాళి
  • మోసపోయిన యువతి ఫిర్యాదుతో అరదండాలు

పెళ్లై పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని మోసగించి పెళ్లాడిన ఆర్మీ జవానుకు పోలీసులు అరదండాలు వేశారు. రాచకొండ పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సురపం రమేశ్ (29)కు 8 ఏళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉంది. ఆర్మీలో జవానుగా పనిచేస్తున్న రమేశ్ హైదరాబాద్‌లోని బాలాజీనగర్‌లో ఉంటున్న స్నేహితుడి ఇంటికి తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి (22)తో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది.

అయితే, తనకు వివాహమైందన్న విషయాన్ని దాచిపెట్టిన రమేశ్.. ఆమెను ఆదిలాబాద్ తీసుకెళ్లి ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం బాలాజీనగర్‌కు తీసుకొచ్చి కాపురం పెట్టాడు. విషయం తెలిసిన భార్య ఈ నెల 23న వారిని నిలదీసింది. అనంతరం భర్తను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో తాను మోసపోయిన విషయాన్ని గుర్తించిన యువతి జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితుడు రమేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

More Telugu News