cm: సీఎం జగన్ పై కూన రవికుమార్ తీవ్ర విమర్శలు

  • టీడీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు
  • వైసీపీ తాటాకు చప్పుళ్లకు బెదరం
  • టీడీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్‌ నెల రోజుల అజ్ఞాతం వీడి ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ఓ ఫ్యాక్షన్ లీడర్ అని, అలాంటి మనస్తత్వం గల నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అంతటా ఫ్యాక్షన్ విస్తరిస్తుందని గతంలోనే చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు.

 టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపైనా వేధింపులకు పాల్పడుతోందని, అక్రమ కేసులు బనాయించారని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తనపై అక్రమకేసులు బనాయించడం గురించి ఏమీ తెలియదని స్పీకర్ తమ్మినేని సీతారాం చెబుతున్న మాటలు అబద్ధమని విమర్శించారు. సీతారాం నోటి వెంట నిజాలు వస్తాయని ఈ జిల్లా ప్రజలు ఊహించరని ధ్వజమెత్తారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు బెదరమని, టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు.

More Telugu News