MLC ashokbabu: కేసీఆర్‌ చేతిలో జగన్‌ కీలుబొమ్మలా మారారు: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు

  • శ్రీవారికి ఆయనతో కలిసి పట్టువస్త్రాల సమర్పణ ఏమిటి?
  • టీటీడీని కూడా తెలంగాణకు అప్పజెబుతారేమో
  • ఎంత మిత్రత్వం ఉన్నా ఏపీ హక్కులు కాలరాస్తారా?

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో జగన్‌ కీలుబొమ్మలా మారిపోయారని, ఏపీ ప్రజల హక్కులను ఆయనకు దఖలు పరుస్తున్నారని ఆరోపించారు. లేదంటే శ్రీవారి ప్రతిష్టాత్మక వార్షిక ఉత్సవం బ్రహ్మోత్సవాల్లో కేసీఆర్‌తో కలిసి జగన్‌ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఏమిటని ప్రశ్నించారు. ఇద్దరి మధ్యా ఎంత మిత్రత్వం ఉన్నా టీటీడీని కూడా తెలంగాణకు అప్పగించేస్తారా? అని ఎద్దేవా చేశారు.

గోదావరి జలాల తరలింపు కూడా ఏపీ భూభాగం నుంచే జరగాలని, వైకుంఠ బ్యారేజీ నిర్మాణం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు. అలాకాకుండా దుమ్ముగూడెం నుంచి వయా నల్గొండ మీదుగా నాగార్జున సాగర్‌కు తరలిస్తే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. గోదావరి నీటి విషయంలో ప్రజా ఉద్యమం తప్పదని, కావేరీ జలాల పోరాటం ఇక్కడ కూడా జరుగుతుందని అన్నారు.

More Telugu News