Imran khan: అంతకుముందు ఎప్పుడూ లేదు.. 9/11 దాడుల తర్వాతే అలా ముడిపెట్టి మాట్లాడుతున్నారు: ఇమ్రాన్

  • ఇస్లాంను, ఉగ్రవాదాన్ని ఒకే గాటన కట్టొద్దు
  • ఎల్‌టీటీఈలో 75 శాతం మంది హిందువులే
  • అప్పుడెవరూ మత ప్రస్తావన తీసుకురాలేదు

వ్యక్తిగత అవసరాల కోసం ఇస్లాంను, ఉగ్రవాదాన్ని ఒకే గాటన కట్టడం సరికాదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హితవు పలికారు. ఇలాంటి ప్రచారం చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ఇస్లాంను, ఉగ్రవాదాన్ని ఒకటిగా చూసే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. ‘విద్వేషపూరిత ప్రసంగాలను అడ్డుకోవడం ఎలా’ అన్న అంశంపై న్యూయార్క్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ సూచన చేశారు.

9/11 ఉగ్రదాడుల తర్వాతే ఇస్లాంను, ఉగ్రవాదాన్ని ముడిపెట్టడం మొదలైందని.. అంతకుముందు ఇలా ఎప్పుడూ లేదని ఇమ్రాన్ పేర్కొన్నారు. శ్రీలంకను వణికించిన ఎల్‌టీటీఈలో 75 శాతం మంది హిందువులేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ సమయంలో ఎవరూ మత ప్రస్తావన తీసుకురాలేదని, కానీ 9/11 తర్వాత ఇస్లాంను, ఉగ్రవాదాన్ని ముడిపెడుతూ మాట్లాడుతున్నారని పాక్ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News