Salman Khan: నేడు జోధ్‌పూర్ కోర్టుకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్.. హతమారుస్తామంటూ ఫేస్‌బుక్‌లో వార్నింగ్

  • 1998లో కృష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలు
  • ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
  • కోర్టు పరిసరాల్లో భారీ భద్రత

కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్ విచారణ నిమిత్తం నేడు జోధ్‌పూర్‌ కోర్టులో హాజరు కానున్నాడు. సల్మాన్ రాక సందర్భంగా కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ కోసం జోధ్‌పూర్ వెళ్లిన సల్మాన్.. అక్కడ సహ నటులు సైఫ్ అలీఖాన్, సోనాలీబెంద్రే, టబు, నీలం కొఠారీ, దుష్యంత్ సింగ్ తదితరులతో కలిసి అడవుల్లోకి వెళ్లి రెండు కృష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలున్నాయి.

ఈ కేసును విచారించిన కోర్టు సల్మాన్‌ను దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సల్మాన్ ప్రస్తుతం బెయిలుపై ఉన్నాడు. కోర్టుకు హాజరు కాకుంటే బెయిలు రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించిన నేపథ్యంలో సల్మాన్ నేడు జోధ్‌పూర్ రానున్నాడు.

కాగా, జోధ్‌పూర్ రానున్న సల్మాన్‌ను హతమారుస్తామంటూ గ్యారీ షూటర్ పేరిట ఫేస్‌బుక్‌లో హెచ్చరిక పోస్టులు కనిపించడంతో పోలీసులు మరింత భద్రత పెంచారు. సల్మాన్ ఫొటోకు రెడ్‌క్రాస్ మార్కు చేసి ‘007 లారెన్స్ బిష్ణోయ్’ ముఠా ఈ హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పోస్టుపై దర్యాప్తు చేస్తున్నట్టు  రాజస్థాన్ పోలీసులు తెలిపారు.

More Telugu News