Chandrababu: ఇది చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనం: ఆమంచి కృష్ణమోహన్

  • నాగార్జునరెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి లేఖ రాస్తారా!
  • సోషల్ మీడియా వేదికగా నాపై ఆరోపణలు తగదు
  • చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుని వెళ్లిపోయారు

చీరాల విలేకరి నాగార్జునరెడ్డిపై దాడి కేసులో తనపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాగార్జునరెడ్డిపై దాడి ఘటన గురించి డీజీపీకి చంద్రబాబు లేఖ రాయడం, బాబు దిగజారుడు తనానికి నిదర్శనం అని అన్నారు.

తన గురించి, తన కుటుంబం గురించి సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుని వెళ్లిపోయారని, గత ఐదేళ్లు నీచమైన పరిపాలన చేశారని చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. గత ప్రభుత్వ హయాంలోని అవినీతి బయటపడుతుందనే చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

చంద్రబాబు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు

నాడు వంగవీటి రంగా హత్య కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడకుండా చంద్రబాబు కాపాడారని, కర్నూలు జిల్లాలో నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయించారని, ఇలాంటి దారుణాలు చేయించిన చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. చంద్రబాబు వల్లే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కోడెల అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు విక్టరీ సింబల్ ఎందుకు చూపించారని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తితో కూడా రాజకీయం చేయాలని బాబు యత్నించారని అన్నారు.

నాడు ఆంధ్రప్రభ రిపోర్టర్ హత్య కేసులో మాజీ మంత్రి పుల్లారావుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని బాబును ప్రశ్నించారు. వైఎస్ జగన్ నీతి, నిజాయతీ ముందు చంద్రబాబు సరిపోరని, ప్రతి విషయాన్ని సీఎం జగన్ కు ఆపాదించడం మంచిది కాదని, అక్రమంగా ఉంటున్న చంద్రబాబు ఇంటిని ఎప్పుడు కూలుస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

More Telugu News