Visakhapatnam District: విశాఖ మన్యంలో దారుణం: చేతబడి అనుమానంతో గిరిజనుడికి చిత్రహింసలు.. ఆపై సజీవ దహనం!

  • నాలుగు గంటలపాటు కొనసాగిన చిత్రహింసలు
  • కాళ్లు చేతులు కట్టేసి గ్రామ నడిబొడ్డున సజీవ దహనం
  • రాత్రికి రాత్రే తప్పించుకున్న భార్య, కుమార్తె

చేతబడి అనుమానంతో ఓ గిరిజనుడిని తోటి గిరిజనులే నాలుగు గంటలపాటు చిత్రహింసలు పెట్టి ఆపై సజీవ దహనం చేసిన ఘటన విశాఖపట్టణం మన్యంలోని డుంబ్రిగూడ మండలం, పుట్టుబందలో జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కిల్లో జయరాం (45)ను మంగళవారం మధ్యాహ్నం పంచాయతీకి పిలిచారు.

అయితే, అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చిన జయరాంను సాయంత్రం మరోమారు ఇంటికొచ్చి పిలిచారు. దీంతో మళ్లీ అక్కడికి వెళ్లిన జయరాంను అక్కడి పెద్దలు ఒక్కసారిగా తాళ్లతో బంధించారు. ఆపై కర్రలతో చితకబాది చిత్రహింసలకు గురిచేశారు. భార్య, కుమార్తెలు అడ్డుకున్నా వారు వదిలిపెట్టలేదు సరికదా.. నాలుగు గంటలపాటు  చిత్రహింసలు పెట్టారు.

 అనంతరం బాధితుడి కాళ్లు, చేతులు కట్టేసి గ్రామం నడిబొడ్డున సజీవ దహనం చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన భార్య, కుమార్తెను చంపుతామని బెదిరించడంతో వారు రాత్రికిరాత్రే పారిపోయి వేరే గ్రామం చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం లేకపోవడంతో ఇప్పటి వరకు స్పందించలేదు.

More Telugu News