mukesh ambani: 'నంబర్ వన్' శ్రీమంతుడు.. ముఖేష్ అంబానీ!

  • రూ.3,80,700 కోట్ల సంపదతో అగ్రస్థానంలో ముఖేష్ 
  • రెండు, మూడు స్థానాల్లో హిందూజా, విప్రో అధినేతలు 
  • 25 ఏళ్లకే జాబితాకెక్కిన ఓయో రూమ్స్ సీఈవో

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోమారు భారత్‌లోనే అత్యంత శ్రీమంతుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ ఏడాదికిగాను ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్‌మెంట్-హ్యూరన్‌లు విడుదల చేసిన ఈ జాబితాలో ముఖేష్ అంబానీ వరుసగా ఎనిమిదోసారి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని అలంకరించారు. రెండో స్థానంలో భారత్‌కే చెందిన లండన్ వాసులు ఎస్‌పీ హిందూజా, ఆయన కుటుంబ సభ్యులు నిలిచారు. ముఖేష్ సంపద రూ.3,80,700 కోట్లు కాగా, హిందూజాల సంపద రూ.1,86,500 కోట్లు. రూ.1,17,100 కోట్ల నికర సంపదతో విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ మూడో స్థానంలో నిలిచారు.

మహిళల విభాగంలో మొత్తం 152 మందికి ఈ జాబితాలో చోటు లభించగా హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రైజెస్ సీఈవో రోషిణి నాడార్ అత్యంత శ్రీమంతుల్లో మొదటి స్థానంలో నిలవగా, గోద్రెజ్ గ్రూపునకు చెందిన స్మితా వి కృష్ణ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక, స్వయం శక్తితో వ్యాపారవేత్తగా ఎదిగిన మహిళల్లో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా అత్యంత శ్రీమంతురాలిగా అవతరించారు.

25 సంవత్సరాలకే రూ.7,500 కోట్ల సంపదతో ఓయో రూమ్స్ సీఈవో రితేశ్ అగర్వాల్ అతిపిన్నవయస్కుడిగా రికార్డులకెక్కారు. 40 ఏళ్ల లోపు వారిలో మీడియా డాట్ నెట్‌కు చెందిన దివ్యాంక్ తురాఖి చోటు సంపాదించారు. అలాగే, 82 మంది ప్రవాస భారతీయులు శ్రీమంతుల జాబితాలోకి ఎక్కారు. ఇక ఈ జాబితాలో 246 మంది ధనవంతులతో ముంబై అగ్రస్థానంలో నిలవగా 175 మంది ఢిల్లీ, 77 మందితో బెంగళూరు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

More Telugu News