Venumadhav: వేణుమాధవ్ కోలుకుంటారు అనుకున్నా.. చాలా బాధాకరం: పవన్ కల్యాణ్

  • అందరినీ నవ్వించే వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం దిగ్భ్రాంతికి గురి చేసింది
  • ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన మరణించడం బాధాకరం
  • వర్తమాన రాజకీయాలపై ఆయనకు చాలా ఆసక్తి ఉండేది

సినీ నటుడు వేణుమాధవ్ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరినీ నవ్వించే వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ... ఆయన కోలుకుంటారని తాను భావించానని తెలిపారు. నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన మరణించడం బాధాకరమని చెప్పారు.

 'గోకులంలో సీత' దగ్గర నుంచి పలు చిత్రాల్లో వేణు తనతో కలసి నటించారని తెలిపారు. మిమిక్రీలో నైపుణ్యం ఉన్న ఆయన... సెట్లో అందరినీ నవ్వించేవారని గుర్తు చేసుకున్నారు. వర్తమాన రాజకీయాలపై ఆయనకు చాలా ఆసక్తి ఉండేదని చెప్పారు. వేణుమాధవ్ మృతికి తన తరపున, జనసైనికుల తరపున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. వేణు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

More Telugu News