Polavaram: పోలవరం పూర్తిచేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా?: ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ సవాల్‌

  • నవంబర్‌ నుంచి చురుగ్గా పనులు
  • ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు
  • డిజైన్‌ మేరకే  నిర్మాణం కొనసాగుతుంది

రెండేళ్లలో పోలవరం పూర్తిచేసి చూపిస్తామని, అలాచేస్తే టీడీపీ నాయకులు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా? అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విపక్ష నాయకులకు సవాల్‌ విసిరారు. ప్రస్తుతం వరద కారణంగా పనులు చేపట్టేందుకు అవకాశం లేదన్నారు. పోలవరం ఎత్తును తగ్గించే ప్రసక్తి లేదని, ఇప్పటికే నిర్ణయించిన డిజైన్‌ మేరకు సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

గుంటూరులో ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పారదర్శకంగా నిర్వహిస్తున్న రివర్స్‌ టెండరింగ్‌తో ప్రభుత్వానికి భారీగా ఆదాయం మిగులుతుండడంతో అభినందించడం పోయి తెలుగుదేశం నాయకులు విమర్శలు చేస్తుండడం దారుణమని ధ్వజమెత్తారు. కాలువ పనులకు మళ్లీ టెండర్లు పిలిస్తే 58 కోట్లు మిగిలాయని, పోలవరం టెండర్లలో రూ.780 కోట్లు మిగిలాయని గుర్తు చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ చేయకుంటే ఆ డబ్బంతా టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లేదన్నారు. అందుకే తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేక రివర్స్‌ టెండరింగ్‌పై నానా యాగీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో వెలిగొండ పనులపైనా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని స్పష్టం చేశారు.

More Telugu News