Pakistan: అమెరికాతో కలిసి నడిచి పాక్‌ తప్పుచేసింది!: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ అంతర్మథనం

  • సీఎఫ్‌ఆర్‌ మేధోవర్గం సదస్సులో వ్యాఖ్యలు
  • 9/11 దాడుల తర్వాత తటస్థంగా ఉండాల్సింది
  • అగ్రరాజ్యంతో చేతులు కలపకుండా ఉంటే బాగుండేది

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాతో చేతులు కలిపి తాము చాలా నష్టపోయామని, అలా చేయకుండా ఉండాల్సిందని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇప్పుడు వాపోతున్నారు. న్యూయార్క్‌లో జరిగిన విదేశీ సంబంధాల మండలి (సీఎఫ్‌ఆర్‌) మేధోవర్గం సదస్సులో ఇమ్రాన్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పద్దెనిమిదేళ్ల క్రితం అంటే 2001 సెప్టెంబర్‌ 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు న్యూయార్క్‌ మన్ హట్టన్లోని వాణిజ్య భవనాలు (డబ్య్లూటీసీ) ట్విన్‌ టవర్స్‌పై విమానాలతో దాడులు చేసి కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 2,976 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 6 వేల మంది గాయపడ్డారు.

అమెరికాలాంటి అగ్రరాజ్యం ఈ దాడులతో చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు అమెరికా పలు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా పాకిస్థాన్‌ సైనిక స్థావరాల సమీపంలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ను 2011, మే 2వ తేదీన అమెరికా దళాలు అర్ధరాత్రి దాడిచేసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌ సైన్యానికి తెలిసే ఇదంతా జరిగిందన్నది అప్పటి చర్చ. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ 9/11 తర్వాత సంఘటనలపై ఇప్పుడు వాపోవడం చర్చనీయాంశమైంది. ఉగ్రవాదంపై పోరుకోసం అమెరికాతో చేతులు కలపకుండా తటస్థంగా ఉండాల్సిందని, చేతులు కలిపి భారీ మూల్యం చెల్లించుకున్నామని ఇమ్రాన్‌ వాపోయారు.  దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.

More Telugu News