Hyderabad: బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్.. కాసేపటికే విడుదల

  • వెంగళరావు పార్క్ వద్ద ఘటన
  • కారులో వచ్చి యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దుండగులు
  • సెల్‌ఫోన్ తీసుకుని మౌలాలిలో వదిలిపెట్టిన వైనం

అర్ధరాత్రి వేళ బంజారాహిల్స్ రోడ్డు నంబరు-1లోని వెంగళరావు పార్క్‌ వద్ద జరిగిన కిడ్నాప్ కలకలం రేపింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే బాధితుడి వద్ద మొబైల్ ఫోన్ లాక్కుని కిడ్నాపర్లు విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండకు చెందిన ఎం.మహేందర్ (21) మూసాపేటలోని కళామందిర్ క్యాంటిన్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం తన స్నేహితులు శ్రీకాంత్, రమేశ్‌లతో కలిసి చార్మినార్ ను చూసేందుకు వెళ్లారు. వీరితోపాటు రమేశ్ భార్య సుష్రత్ కూడా ఉంది. చార్మినార్ సందర్శన అనంతరం ట్యాంక్‌బండ్ వెళ్లిన వారంతా రాత్రికి వెంగళరావు పార్కు వద్దకు చేరుకున్నారు.  

అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో తామంతా పార్క్ వద్ద ఉండగా, కారులో వచ్చిన ముగ్గురు దుండగులు తమపై దాడిచేసి మహేందర్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు శ్రీకాంత్, రమేశ్‌లు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మహేందర్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దుండగులు అతడిని కొట్టి సెల్‌ఫోన్ లాక్కుని మౌలాలిలో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి బోరబండలోని ఇంటికి చేరుకున్న మహేందర్ స్నేహితులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News