KCR: ప్రజలు తలుచుకుంటే ఎలాంటి జాతకాన్నయినా తారుమారు చేయగలరని కేసీఆర్ తెలుసుకోవాలి: విజయశాంతి

  • కేసీఆర్ ది దొర అహంకారం అంటూ వ్యాఖ్యలు
  • తెలంగాణ కోసం పోరాడిన వాళ్లను పట్టించుకోవడంలేదంటూ విమర్శలు
  • ఉద్యోగులను కించపరుస్తున్నారంటూ ఆరోపణ

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. ప్రజలకు ఏమీ చేయకపోయినా వచ్చే పదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని మితిమీరిన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. కొందరు జ్యోతిష్కులు చెప్పిన విషయాన్ని కేసీఆర్ తలకెక్కించుకున్నట్టుగా ఉందని తెలిపారు. అయితే ప్రజలు తలుచుకుంటే ఎలాంటి జాతకాన్నయినా తారుమారు చేయగలరన్న విషయాన్ని కేసీఆర్ గుర్తెరగాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఓయూ విద్యార్థులను దూరం పెట్టిన విధంగానే, ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రభుత్వ ఉద్యోగులను సైతం అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ది దొర అహంకారమని, ఆయన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని విజయశాంతి మండిపడ్డారు.

More Telugu News