Road Accident: తాను చనిపోతూ 20 మంది ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్‌

  • డ్రైవింగ్‌లో ఉండగా గుండెపోటు
  • బస్సును పొలాల్లోకి జాగ్రత్తగా తీసుకువెళ్లి నిలిపిన చోదకుడు
  • శ్రీకాకుళం జిల్లా అక్కువరం వద్ద ఘటన

వాహనాన్ని నడుపుతుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో 20 మంది ప్రాణాలు కాపాడేందుకు వాహనాన్ని సురక్షితంగా పొలాల్లోకి చేర్చి తుదిశ్వాస విడిచిన డ్రైవర్‌ ఘనత ఇది. విషాదాంతమైన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. దమన్‌జోడి నుంచి భువనేశ్వర్‌కు ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఈరోజు ఉదయం వెళ్తోంది.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని అక్కువరం దగ్గరకు వచ్చే సరికి డ్రైవర్‌ జోగేందర్‌శెట్టికి గుండెపోటు వచ్చింది. అప్పటికి బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అసలే జాతీయ రహదారి, తేడా అయితే ప్రమాదం జరిగి అందరి ప్రాణాలు పోతాయి. దీన్ని గుర్తించిన డ్రైవర్‌ ప్రాణాలను బిగపట్టుకుని జాగ్రత్తగా బస్సును రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి తీసుకువెళ్లాడు. బస్సు సురక్షితంగా నిలిచిన కాసేపటికి జోగేందర్‌శెట్టి తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రయాణికులను తీవ్రంగా కదిలిచింది. చనిపోతూ తమ ప్రాణాలు కాపాడాడని కొనియాడారు.

More Telugu News