Crime News: పూడిక తీస్తే శవాలు బయటపడ్డాయి...అన్నీ నవజాత శిశువులవే

  • మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో ఘటన
  • బయటపడిన 10 శిశు కళేబరాలు
  • స్థానికంగా సంచలనం రేపిన ఘటన

ఆరు నెలలుగా కాలువలో పూడిక తీయక పోవడంతో మురుగు పారేందుకు సమస్యలు తలెత్తుతున్నాయని భావించి చెత్త తీస్తుంటే మృతదేహాలు బయటపడడం స్థానికంగా సంచలనమైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది మృత శిశువు కళేబరాలు బయట పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే...మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లే దారిలోని కల్వర్టు వద్ద నెలల నుంచి పూడిక తీయలేదు. కాలువలో చెత్తాచెదారం, ముళ్ల చెట్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఎక్సకవేటర్‌ ఉపయోగించి వీటిని తొలగిస్తుండగా పది వరకు శిశువుల కళేబరాలు, తెగిపడిన అవయవాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు అవాక్కయ్యారు. భ్రూణ హత్యలు, ప్రేమ వ్యవహారాల కారణంగా గర్భందాల్చిన వారు అబార్షన్ లకు పాల్పడుతున్నారని ఈ ప్రాంతంలో గతంలో ఆరోపణు ఉన్నాయి. మృతశిశువు కళేబరాలు లభ్యం కావడానికి అదే కారణమని భావిస్తున్నారు.

ఈ విషయమై మండల వైద్యాధికారి వివరణ కోరగా ప్రాథమిక చికిత్సా కేంద్రాలు (ఆర్‌ఎంపీ ఆసుపత్రులు), ప్రైవేటు ఆసుపత్రులు తమ అధీనంలో ఉండవని, అక్కడ జరిగే వాటితో తమకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

More Telugu News