Peddireddy: శివప్రసాద్ మృతదేహాన్ని చూసి, భావోద్వేగానికి లోనైన వైకాపా నేత పెద్దిరెడ్డి!

  • ఈ ఉదయం నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి
  • కుటుంబ సభ్యులకు పరామర్శ
  • నేడు ముగియనున్న అంత్యక్రియలు

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వైకాపా నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శివప్రసాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ఆయన, శివప్రసాద్ విలక్షణ రాజకీయ నాయకుడని, ప్రతిభగల నటుడని అన్నారు. శివప్రసాద్ తో తనకున్న సంబంధం రాజకీయాలకు అతీతమైనదని అన్నారు. ఆయన అకాల మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేరుకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నానని అన్నారు.

తనను శివప్రసాద్ అన్నయ్యా అంటూ ప్రేమతో పలకరించేవారని, అటువంటి మిత్రుడిని తాను కోల్పోయానని అన్నారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి పరామర్శించారు. కాగా, శివప్రసాద్ అంత్యక్రియలు నేడు చంద్రగిరి సమీపంలోని అగరాలలో జరగనున్నాయి. ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు లోకేష్‌ తదితరులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. మరికాసేపట్లో శివప్రసాద్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

More Telugu News