Chittoor District: వైఎస్సార్‌ పిలిచారు...జగన్‌ పెళ్లికి మాజీ ఎంపీ శివప్రసాద్‌ ఏం చేశారో తెలుసా?

  • వంద వాహనాల్లో జనంతో తిరుపతి నుంచి వివాహానికి
  • భూమన కరుణాకరరెడ్డితో సహా హాజరు
  • 1996లో ఎంపీ టికెట్‌ ఆఫర్‌ చేసిన వైఎస్‌

రాజకీయంగా అన్ని పార్టీలతోను, ముఖ్య నాయకులతోను సన్నిహిత సంబంధాలు నెరపే చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్‌ జీవితంలో ఓ అనుభవం ఇది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పెళ్లి సందర్భంలో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదట. రాజశేఖర్‌రెడ్డి తండ్రి వై.ఎస్‌.రాజారెడ్డితో శివప్రసాద్‌కు పరిచయం ఉండేది. దీంతో రాజశేఖర్‌రెడ్డితోనూ శివప్రసాద్‌కు మంచి సంబంధాలు ఉండేవి. ఇటు చంద్రబాబుతో ఎంత సాన్నిహిత్యంతో ఉండేవారో వైఎస్‌తోనూ అంత సాన్నిహిత్యంతో ఉండేవారు.

అందుకే కాంగ్రెస్‌, టీడీపీ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందినా అప్పటికి సినిమాలంటే మంచి మోజున్న శివప్రసాద్‌ దానికే పరిమితమయ్యేందుకు ఇష్టపడి తిరస్కరించే వారట. 1996లో చిత్తూరు నుంచి కాంగ్రెస్‌  అభ్యర్థిగా  పోటీ చేయాలని శివప్రసాద్‌ను వైఎస్సార్‌ స్వయంగా కోరారు. అయితే ఆ పార్టీ మరో సీనియర్‌ నేత నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి అడ్డుపడడంతో అది వీలుకాలేదంటారు. అంతలా వైఎస్‌ కుటుంబంతో శివప్రసాద్‌కు సంబంధాలు ఉండేవి. దీంతో వై.ఎస్‌.జగన్‌ పెళ్లికి ఆహ్వానం అందడంతో తిరుపతికి చెందిన భూమన కరుణాకరరెడ్డితో కలిసి దాదాపు వంద వాహనాల్లో జనంతో శివప్రసాద్‌ పెళ్లికి హాజరై ఆశ్చర్యపరిచారు.

More Telugu News