goat: అనారోగ్యంతో మృతి చెందిన తల్లి మేక.. దాని పిల్లలకు పాలిచ్చి ఆకలి తీరుస్తున్న శునకం

  • ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో ఘటన
  • పది రోజులుగా రెండు పూటలా పాలిస్తున్న శునకం
  • చూసేందుకు తరలివస్తున్న జనం

రెండు పిల్లలకు జన్మనిచ్చిన ఓ మేక ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందింది. పాలులేక అల్లాడిపోతున్న దాని పిల్లలకు ఓ శునకం తల్లైంది. తన పొదుగును వాటికి అందించి ఆకలి తీరుస్తోంది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని కొత్తూరులో మేక పిల్లలకు పాలు ఇస్తున్న ఈ శునకాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విషయం తెలిసి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తరలివస్తున్నారు.

గ్రామానికి చెందిన కొండయ్య అనే మేకల కాపరికి చెందిన మేక ఇటీవల రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అనారోగ్యం బారినపడిన తల్లిమేక పది రోజుల క్రితం మృతి చెందింది. దీంతో పాలు లేక పిల్లలు విలవిల్లాడాయి. అయితే, ఈ విషయం మేకలకు కాపలా ఉండే శునకం ఎలా గ్రహించిందో.. వాటి వద్దకు వెళ్లి తన పొదుగును అందించింది. అంతే.. అవి ఆవురావురుమంటూ పాలను తాగి కడుపు నింపుకున్నాయి. గత పది రోజులుగా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళ్లలో ఆ శునకం మేక పిల్లలకు పాలిస్తోందని కొండయ్య తెలిపాడు.

More Telugu News