Andhra Pradesh: ఏపీలో వాహన జరిమానాల తగ్గింపు... అధికారుల సిఫార్సులివే!

  • ఏపీలో 90 లక్షల వాహనాలు
  • 45 శాతం మందికి లైసెన్స్ లు లేవు
  • తొలుత అవగాహన కల్పించాలన్న అధికారులు
  • జరిమానాలను సగానికి పైగా తగ్గించాలని నివేదిక

ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కేంద్రం సిఫార్సు చేసిన భారీ జరిమానాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయవద్దని రవాణా అధికారుల కమిటీ నుంచి ప్రభుత్వానికి సిఫార్సులు అందాయి. ఇంత భారీ జరిమానాలను విధించే ముందు ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సివుందని, ప్రస్తుతానికి మధ్యస్తంగా జరిమానాలను ఉంచుదామని అధికారులు సిఫార్సు చేశారు. పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ జరిమానాలు అమలు కావడం లేదని గుర్తు చేశారు.

కాగా, ఏపీలో అన్ని కేటగిరీలకూ చెందిన దాదాపు 90 లక్షల వాహనాలు ఉండగా, వాటిని నడుపుతున్న వారిలో 45 శాతం మందికి లైసెన్స్ లు లేవని తాము గతంలో నిర్వహించిన సర్వేలో తేలినట్టు అధికారులు తెలిపారు. ఇక అధికారులు సిఫార్సు చేస్తున్న జరిమానాలను పరిశీలిస్తే, రోడ్డు నిబంధనల అతిక్రమణకు రూ. 250 (కేంద్రం నిర్దేశించినది రూ. 500), లైసెన్స్ లేకుండా అనధికార వాహనం నడిపితే రూ. 2 వేలు (కేంద్రం నిర్దేశించినది రూ. 5 వేలు), లైసెన్స్ లేకుండా పట్టుబడితే రూ. 2,500 (కేంద్రం నిర్దేశించినది రూ. 5 వేలు) విధిస్తే చాలని అధికారులు సిఫార్సు చేశారు.

ఇక అర్హత లేకుండా వాహనం నడిపితే రూ. 4 వేలు (కేంద్రం నిర్దేశించినది రూ. 10 వేలు), ఓవర్ లోడింగ్ తో వెళితే రూ. 750 (కేంద్రం నిర్దేశించినది రూ. వెయ్యి నుంచి రూ. 2 వేలు), డ్రంకెన్ డ్రైవ్ రూ. 5 వేలు (కేంద్రం నిర్దేశించినది రూ. 10 వేలు), పర్మిట్ లేకుంటే రూ. 6,500 (కేంద్రం నిర్దేశించినది రూ. 10 వేల వరకూ), ఇన్స్యూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 1,250 (కేంద్రం నిర్దేశించినది రూ. 2 వేలు), సీట్ బెల్ట్ లేకుంటే రూ. 500 (కేంద్రం నిర్దేశించినది రూ. 1000) విధించాలని తన నివేదికలో పేర్కొంది.

More Telugu News