Nizamabad District: నిజామాబాద్‌లో దారుణం.. యువతిపై ఏడుగురి గ్యాంగ్ రేప్

  • సినిమా పేరుతో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన యువకుడు
  • అత్యాచారం చేసి, ఆపై స్నేహితులకు కబురు
  • పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

సినిమాకు వెళ్దామని చెప్పి ఓ యువతిని వెంట పెట్టుకుని వెళ్లిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా, తన స్నేహితులు మరో ఆరుగురిని పిలిపించి యువతిని వారికి అప్పగించాడు. నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడికి పక్క గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. సినిమాకు వెళ్దామని చెప్పి శుక్రవారం యువతిని తన బైక్‌పై ఎక్కించుకున్న యువకుడు సినిమాకు కాకుండా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం తన స్నేహితులకు సమాచారం అందించడంతో ఆటోలో అక్కడికి చేరుకున్న ఆరుగురు యువకులు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం నిందితులు చెరో దిక్కుకు పరారవగా, అటువైపుగా వచ్చిన పెట్రోలింగ్ వాహనంలోని పోలీసులు ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏడుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News