TTD: రావాలి జగన్ కాదు.. పోవాలి జగన్ అంటున్నారు: భానుప్రకాశ్ రెడ్డి

  • ఏ ఉద్దేశంతో టీటీడీ పాలకమండలిలోకి 36 మందిని తీసుకున్నారు
  • అహంకార ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు
  • 100 రోజుల్లోనే జగన్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది

టీటీడీ పాలకమండలి నియామకంపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాలకమండలి నియామకం సరిగా జరగలేదని వ్యాఖ్యానించారు. ఏ ఉద్దేశంతో పాలకమండలిలోకి 36 మంది సభ్యులను తీసుకున్నారని ప్రశ్నించారు. టీటీడీ సభ్యులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా వస్తే.. వాహన మండపం సరిపోదని అన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తిరుమల, టీటీడీ చరిత్ర ఏమిటో ముందు జగన్ తెలుసుకోవాలని సూచించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నన్నెవరు అడుగుతారనే అహంకార ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. అవసరానికి మించి, రాజకీయ ప్రయోజనాల కోసం, అసంతృప్తులకు రాజకీయ పునరావాసం కల్పించేలా జగన్ నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పారు. జగన్ నిర్ణయాలతో టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థా? లేక ధర్మసత్రమా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జగన్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోందని అన్నారు. రావాలి జగన్ అని కాకుండా... పోవాలి జగన్ అని ప్రజలు అంటున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News