Jagan: జగన్ గారూ, కొత్తగా ఏదైనా ట్రై చేయండి.. లేకపోతే ప్రజల్లో కామెడీ పీస్ గా మిగిలిపోతారు: నారా లోకేశ్

  • 2004కు ముందు చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను జరపబోమని ప్రకటించారు
  • మీ తండ్రి సీఎం అయ్యాక తవ్వకాల కోసం రస్ అల్ ఖైమాను తీసుకొచ్చారు
  • 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక మళ్లీ తవ్వకాలను రద్దు చేశారు

సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 2004కు ముందు గిరిజనుల మనోభావాలను గౌరవించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు... గిరిజనుల మనుగడకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలను జరపబోమని ప్రకటించారని చెప్పారు. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గత ప్రభుత్వ నిర్ణయానికి తూట్లు పొడిచి, బాక్సైట్ తవ్వకాల కోసం రస్ అల్ ఖైమా సంస్థను తీసుకొచ్చారని విమర్శించారు.

2014లో మళ్లీ సీఎం అయిన చంద్రబాబు... మీ తండ్రి బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారని తెలిపారు. ఇప్పుడు మీరు మళ్లీ కొత్తగా బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తున్నామని నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మీ నాటకాలు, దానికి సాక్షి రాతలు చూస్తుంటే... సిగ్గు కూడా సిగ్గు పడుతుంది జగన్ గారూ అని వ్యాఖ్యానించారు.

'అదేదో సినిమాలో 'జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ' అని కామెడీ చేసినట్టు... ఎత్తేసిన కేసులనే మళ్లీ ఎత్తేయడం, రద్దు చేసిన వాటినే మళ్లీ రద్దు చేయడం కాకుండా.... ఏదైనా కొత్తగా ప్రయత్నించండి. లేకపోతే ప్రజల్లో కామెడీ పీస్ గా మిగిలిపోతారు' అని ట్వీట్ చేశారు.

More Telugu News