Ex.MP sivaprasad: క్షీణించిన మాజీ ఎంపీ శివప్రసాద్‌ ఆరోగ్యం: వెంటిలేటర్‌పై చికిత్స

  • చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వైద్యసహాయం
  • కిడ్నీ సంబంధిత సమస్యలతో సతమతం
  • నేడు సాయంత్రం చెన్నై వెళ్లనున్న చంద్రబాబు

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు, సినీ నటుడు నారమల్లి శివప్రసాద్‌ ఆరోగ్యం మరింత క్షీణించిందని సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్న శివప్రసాద్‌ కిడ్నీ సంబంధిత సమస్య తలెత్తడంతో రెండు రోజుల క్రితమే ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు.

అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని సమాచారం. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శివప్రసాద్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన చెన్నై వెళ్లి శివప్రసాద్‌ను పరామర్శించనున్నారు. 2009, 2014లో చిత్తూరు నుంచి రెండుసార్లు టీడీపీ ఎంపీగా గెలిచిన శివప్రసాద్‌ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో తనదైన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నారు.

More Telugu News