MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

  • ధోనీ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైంది
  • జట్టు నుంచి పక్కన పెట్టక ముందే.. రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది
  • టీ20 ప్రపంచకప్ సమయానికి ధోనీ వయసు 39కి చేరుకుంటుంది

క్రికట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి సమయం ఆసన్నమైందని భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ యాజమాన్యం పక్కన పెట్టకముందే... ధోనీ రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని సూచించారు. ధోనీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదని... తన భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయో ధోనీనే చెప్పాలని అన్నారు. ధోనీ వయసు ప్రస్తుతం 38 ఏళ్లని... టీ20 ప్రపంచ కప్ సమయానికి ఆయన వయసు 39కి చేరుకుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో, ధోనీకి ప్రత్యామ్నాయాన్ని బీసీసీఐ అన్వేషించాలని సూచించారు.

భారత క్రికెట్ కి ధోనీ చేసిన సేవలను మరువలేమని... పరుగులు సాధించడమే కాకుండా, అతను చేసిన స్టంపింగులు అద్భుతమని గవాస్కర్ తెలిపారు. ధోనీ మైదానంలో ఉంటే కెప్టెన్ కు కూడా చాలా అండగా ఉంటుందని... ధోనీ సలహాలతో కెప్టెన్ కు కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. కానీ, ధోనీ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైందని తాను బలంగా నమ్ముతున్నానని తెలిపారు. ధోనీకి ఉన్న ఎంతో మంది అభిమానుల్లో తాను కూడా ఒకడినని చెప్పారు. ఎవరూ అడగక ముందే ధోనీ తనంతట తాను క్రికెట్ నుంచి తప్పుకోవడం మంచిదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని కితాబిచ్చారు.

More Telugu News