Andhra Pradesh: ఏపీ ‘గ్రామ సచివాలయం’ పేపర్ లీకేజీ.. ఏపీపీఎస్సీ ఉద్యోగుల కుటుంబాలకే టాప్ ర్యాంకులు: మీడియాలో కథనాలు

  • సంచలన కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక
  • పేపర్ టైప్ చేసిన ఉద్యోగే టాపర్ గా నిలిచారని వెల్లడి
  • రిటైర్డ్ అధికారి చేతికి ముందుగానే ప్రశ్నాపత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు, వాలంటీర్ పరీక్షల ఫలితాలపై వివాదం చెలరేగుతోంది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను నిన్న విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ రోజు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను జిల్లాలవారీగా ప్రకటిస్తుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసేలా ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. ఈ పరీక్ష పేపర్లను సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువులే టాప్ ర్యాంకర్లుగా భారీ మార్కులు సాధించారని సదరు పత్రిక తన కథనంలో తెలిపింది.

అనంతపురం జిల్లాకు చెందిన జి.అనితమ్మ అనే అమ్మాయి కేటగిరి-1 విభాగంలో టాపర్ గా నిలిచారనీ, అయితే ఆమె ఏపీపీఎస్సీ కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి(జూనియర్ అసిస్టెంట్)గా పనిచేస్తున్నారని వెల్లడించింది. గ్రామ వార్డు, సచివాలయం పేపర్ ను ఆమె టైప్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నట్లు పేర్కొంది. ఇక కేటగిరి-3లో ఫస్ట్ ర్యాంకర్ దొడ్డా వెంకట్రామిరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఈయన సొంత అన్న వెన్నా మహేశ్వర్ రెడ్డి ఏపీపీఎస్సీలోనే ఏఎస్ వో హోదాలో పనిచేస్తున్నారు.

అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన ఓ రిటైర్డు అధికారి చేతికి ఈ ప్రశ్నాపత్రం ముందుగానే వెళ్లిపోయినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది. ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుటుంబంలో భార్య సహా ముగ్గురికి గ్రామసచివాలయం పరీక్షల్లో 3 ర్యాంకులు వచ్చాయని చెప్పింది. 150 మార్కులకు గానూ నిర్వహించిన ఈ పరీక్ష చాలా కఠినంగా ఉందని పలువురు అభ్యర్థులు చెప్పారనీ, 100 మార్కులు దాటితే గొప్పేనని. కానీ అనూహ్యంగా ఫస్ట్ ర్యాంకర్ కు 112.50 మార్కులు రావడంతో ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందన్న అనుమానాలు బలపడ్డాయని సదరు పత్రిక తన కథనంలో చెప్పింది.

More Telugu News