Rajanna Sircilla District: నీటి ప్రవాహ వేగానికి కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

  • వేములవాడ మూలవాగు వద్ద ఘటన
  • కొన్నాళ్లుగా నత్తనడకన సాగుతున్న నిర్మాణం
  • నిర్లక్ష్యమే ఘటనకు కారణమని ఆరోపణలు

భారీ వాహనాల రాకపోకల కోసం ఓ వాగుపై నిర్మిస్తున్న వంతెన కాస్త నీటి ప్రవాహానికే కుప్పకూలిపోవడం సంచలనమైంది. ఇంకా నిర్మాణం పూర్తి చేసుకోని వంతెన ఈరోజు ఉదయం హఠాత్తుగా నేలమట్టమయ్యింది. వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ మండల కేంద్రానికి సమీపం నుంచి ప్రవహిస్తున్న మూలవాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 28 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణాన్ని నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు.

వేములవాడ బస్టాండ్ నుంచి తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయానికి రాకపోకల నిమిత్తం ఈ వంతెన నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వంతెన పూర్తిస్థాయిలో అవసరాలు తీర్చలేకపోవడంతో మరో రెండు వంతెనల నిర్మాణం ప్రతిపాదించారు. ఒకదాని నిర్మాణం పూర్తికాగా దాన్ని ప్రారంభించారు.

రెండో వంతెన పనులు కొన్నాళ్లుగా నత్తనడకన సాగుతుండడంతో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వంతెనే ఏకంగా కూలిపోవడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు.

More Telugu News