assam: అసోంలో దారుణం.. పోలీస్ స్టేషన్‌లో అక్కాచెల్లెళ్లలను వివస్త్రలను చేసి చావబాదిన పోలీసులు

  • వేరే మతం అమ్మాయిని ప్రేమించి తీసుకెళ్లిన యువకుడు
  • పోలీసుల దాడిలో ఓ మహిళకు గర్భస్రావం
  • పోలీసు అధికారి, మహిళా కానిస్టేబుల్ సస్పెన్షన్ 

అసోంలోని దర్రాంగ్ జిల్లాలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఓ కేసు విషయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వారిని వివస్త్రలను చేసి దారుణంగా చితకబాదారు. మహిళల్లో ఒకరు గర్భిణి అన్న కనీస కనికరం లేకుండా లాఠీలతో చావబాదారు. దీంతో ఆమెకు గర్భస్రావమైంది. మహిళలపై దాడిచేసిన పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉండడం గమనార్హం. విషయం బయటకు రావడంతో స్పందించిన ప్రభుత్వం ఓ పోలీసులు అధికారితోపాటు మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది.

బాధిత అక్కాచెల్లెళ్ల సోదరుడు గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించి ఆమెతో కలిసి వెళ్లిపోయాడు. వీరివి వేర్వేరు మతాలు కావడంతో వివాదం పెద్దదైంది. దీంతో యువతి కుటుంబం చేసిన ఫిర్యాదుతో బాధిత మహిళలను, వివాహిత భర్తను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వారిని చితక్కొట్టారు. అమానవీయంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News