PUNJAB: చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దొంగ.. ఒక్క ఉదుటున లేచిన తల్లి.. వీడియో ఇదిగో!

  • పంజాబ్ లోని లూథియానాలో ఘటన
  • సైకిల్ రిక్షాలో బాలిక కిడ్నాప్ కు ప్రయత్నం
  • నిందితుడిని పట్టుకున్న స్థానికులు

చల్లటి గాలికి తన నాలుగేళ్ల చిన్నారితో కలిసి ఓ తల్లి ఆరుబయటే నిద్రపోయింది. అయితే దీన్ని గమనించిన ఓ కిడ్నాపర్ పాపను ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేశాడు. చల్లగా వచ్చి చిన్నారిని తన సైకిల్ రిక్షాలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే మేలుకున్న తల్లి ఒక్క ఉదుటన వెళ్లి తన పాపను దగ్గరకు తీసుకుంది. దీంతో కిడ్నాపర్ ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. ఈ ఘటన పంజాబ్ లోని లూథియానాలో చోటుచేసుకుంది.

లూథియానాలో ఓ చిన్నారి తన అమ్మ, నానమ్మతో కలిసి ఆరు బయట నిద్రపోతుండగా, అదే ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి పాపను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ అలికిడికి బాలిక తల్లి మేల్కొని గట్టిగా అరుస్తూ, రిక్షా లోంచి పాపను తీసుకుంది. దాంతో తన రిక్షాలో అతను పరారయ్యాడు. అయితే స్థానికులు అతడిని కొద్దిదూరంలోనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు పాపను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడో ఇంకా తెలియరాలేదని చెప్పారు. బాధిత కుటుంబం ఫిర్యాదు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సదరు నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే అతడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు.

More Telugu News